భూకబ్జాలను అరికట్టలేకపోతే సీఎం రేవంత్రెడ్డి రాజీనామా చేయాలి: ఈటల రాజేందర్

కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో వేలానికి ఉంచిన ప్లాట్లను వెంటనే రద్దు చేయాలని మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. హౌసింగ్ బోర్డు భూములను పేదలకు ఇళ్ల స్థలాలు, ప్రజా అవసరాల కోసం వినియోగించాల్సింది పోయి వాణిజ్య అవసరాల కోసం విక్రయించడం సరికాదన్నారు. భూకబ్జాలను అరికట్టే సత్తా లేకపోతే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో వేలానికి ఉంచిన స్థలాలను సోమవారం స్థానిక నాయకులతో కలిసి ఈటల రాజేందర్ పరిశీలించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 1908లో హైదరాబాద్లో సంభవించిన వరదల అనంతరం ప్రజలకు ఇళ్లను కల్పించేందుకు నిజాం ప్రభుత్వం సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డును ఏర్పాటు చేసిందని తెలిపారు. అనంతరం 1931లో సికింద్రాబాద్ ఇంప్రూవ్మెంట్ బోర్డు, 1960లో హౌసింగ్ బోర్డుగా మారిందన్నారు.కూకట్పల్లి, కైతలాపూర్, హైదర్నగర్ గ్రామాల పరిధిలో సుమారు 1,400 ఎకరాల భూమిని సేకరించి, ఆర్థిక స్థోమతను బట్టి 66, 111, 311, 400 గజాల ప్లాట్లుగా విభజించి ప్రజలకు అందించారని తెలిపారు. హౌసింగ్ బోర్డు ప్రధాన ఉద్దేశం పేద, మధ్యతరగతి ప్రజలకు సొంతింటి కలను నెరవేర్చడమే తప్ప, ప్రభుత్వ భూములను విక్రయించి వ్యాపారం చేయడం కాదన్నారు.2005-06లో కూకట్పల్లిలో భూముల విక్రయాలు ప్రారంభమయ్యాయని, మలేషియా టౌన్షిప్కు 36 ఎకరాలు, హిందూ ప్రాజెక్ట్స్కు 70 ఎకరాలు, లోధాకు 18 ఎకరాలు, ఇండిస్ వన్ సిటీకి 12 ఎకరాల భూములు విక్రయించారని చెప్పారు. ఈ భూముల విక్రయాల ద్వారా వచ్చిన నిధుల్లో సుమారు రూ.1,200 కోట్లు హౌసింగ్ బోర్డు ఖాతాలో ఉన్నాయని, ఆ నిధులను ప్రభుత్వం వినియోగించిందని ఆరోపించారు.ఇటీవల గోద్రెజ్ సంస్థకు కూడా కూకట్పల్లి ప్రాంతంలో 8 ఎకరాల భూమిని విక్రయించారని ఈటల రాజేందర్ తెలిపారు. ఇప్పటికే కూకట్పల్లి అత్యంత జనసాంద్రత కలిగిన ప్రాంతంగా మారిందని, అత్యవసర పరిస్థితుల్లో ఫైర్ ఇంజన్లు వెళ్లేందుకు కూడా ఇబ్బందులు ఏర్పడుతున్నాయని అన్నారు. పాఠశాలలు, పార్కులు, కమ్యూనిటీ హాళ్లు, ఆసుపత్రులు తదితర ప్రజా అవసరాలకు స్థలాలు లేకుండా పోతున్నాయని పేర్కొన్నారు.“ఖాళీ స్థలాలను విక్రయించకుండా చిన్నచిన్న చిల్డ్రన్ పార్కులు, ప్రజా అవసరాల కోసం కేటాయించాలి. రెండో తేదీన నిర్వహించనున్న వేలాన్ని వెంటనే రద్దు చేయాలి” అని ఆయన డిమాండ్ చేశారు. ఈ విషయంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డికి కూడా వినతిపత్రం అందించినప్పటికీ భూముల విక్రయాలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.ప్రభుత్వ భూములను వరుసగా విక్రయిస్తూ హౌసింగ్ బోర్డును వ్యాపార సంస్థగా మార్చడం సరికాదన్నారు. “ఊర్లలో తాతల ఆస్తులు అమ్ముకుని తిరిగేవారిని తిరుగుబోతు అనేవారు. ఇప్పుడు ప్రభుత్వం కూడా ఆస్తులు అమ్ముకుంటూ వెళ్తోంది” అని విమర్శించారు. భూముల విక్రయాలను నిలిపివేయకపోతే ప్రజల నుంచి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.పేదల కోసం డబుల్ బెడ్రూమ్ ఇళ్లను వారి ఉపాధి ప్రాంతాలకు దూరంగా నిర్మించడం వల్ల ప్రయోజనం ఉండదని ఈటల అన్నారు. పేదలు ఎక్కడ నివసిస్తున్నారో అక్కడే వారికి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.6 లక్షలతో ఇళ్ల నిర్మాణం చేపడతామంటూ ప్రభుత్వం చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.

ఎల్లమ్మబండ భూములపై ఆరోపణలుఎల్లమ్మబండ–షంషీగూడ సర్వే నంబర్ 57 భూముల అంశంపై కూడా ఈటల రాజేందర్ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. 2007 నుంచి ఈ భూముల పరిరక్షణ కోసం పోరాడుతున్నానని తెలిపారు. సుమారు 300 ఎకరాల భూముల్లో 170 ఎకరాలను పేదలు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలుగా ఎలా కేటాయించారో ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ఎకరం విలువ రూ.70 కోట్ల వరకు ఉన్న సుమారు 130 ఎకరాల భూమిని కొందరికి అప్పగించారని ఆరోపించారు. అక్రమంగా ఆక్రమించిన భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని గతంలో చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పుడు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు.ఐడీఎల్ భూముల్లో హానర్ హోమ్స్ పేరుతో నిర్మాణాలు చేపట్టి ఒక్కో అపార్ట్మెంట్ను కోట్ల రూపాయలకు విక్రయిస్తున్నారని ఆరోపించిన ఈటల.. గత ప్రభుత్వ హయాంలో కేటాయించిన భూములపై విచారణ జరిపిస్తామని చెప్పిన రేవంత్రెడ్డి ప్రభుత్వం ఈ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.22-ఏ నిబంధనల ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం సమకూర్చే ప్రయత్నం జరుగుతోందని, ఇందులో అక్రమాలకు తావు ఉండకూడదన్నారు. అర్బన్ సీలింగ్ భూములను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నాలను కూడా ప్రభుత్వం నిలిపివేయాలని డిమాండ్ చేశారు.“పేదవాడు పేదవాడిగానే ఉంటుంటే, పెద్దవారి ఆస్తులు ఒకే తరంలో పదింతలు ఎలా పెరుగుతున్నాయి? తెలంగాణ ప్రజలు ఈ పరిణామాలను గమనిస్తున్నారు. పేదల భూములు, ప్రభుత్వ ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది” అని ఈటల రాజేందర్ అన్నారు.ఈ కార్యక్రమంలో వడ్డేపల్లి రాజేశ్వరరావు, శ్రీకర్రావు, మహేందర్, ప్రీతంరెడ్డి, బలవంత్రెడ్డి, సుధం, వరలక్ష్మి, వినోద్, ఐలయ్య, సత్యనారాయణ, ఎంఎస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

