గ్లోబల్ వార్ ఎఫెక్ట్.. నిలిచిన కమర్షియల్ సిలిండర్ల పంపిణీ
కేపీహెచ్బీ హాస్టళ్లలో మెనూ కుదింపు.. పస్తులుంటున్న విద్యార్థులు
రెస్టారెంట్లు, పరిశ్రమలపైనా తీవ్ర ప్రభావం.. దేశవ్యాప్తంగా ఆందోళన

కూకట్పల్లి, నేటి తెలంగాణ : ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న యుద్ధ పరిణామాలతో దేశంలో గ్యాస్ దిగుమతులు అమాంతం పడిపోయాయి. దీని ప్రభావంతో దేశవ్యాప్తంగా కమర్షియల్ సిలిండర్ల పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. ప్రభుత్వం తక్షణమే ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోతే హాస్టళ్లలో ఉండే వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు రోడ్డున పడాల్సిన దుస్థితి వస్తుందని కేపీహెచ్బీ పీజీ హాస్టల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిలిండర్లు దొరకకపోవడంతో విద్యార్థులు పస్తులు ఉండకూడదనే ఉద్దేశంతో ఏకంగా కట్టెల పొయ్యిల మీద వంటలు చేస్తున్నామని వారు స్పష్టం చేశారు. గ్యాస్ నిల్వలు తక్కువగా ఉన్నాయనే ప్రచారంతో వినియోగదారులు ఒక్కసారిగా ఆన్లైన్లో ఎగబడటంతో బుకింగ్ సర్వర్లు క్రాష్ అయ్యాయి. ఏజెన్సీలు కమర్షియల్ గ్యాస్ బుకింగ్స్ మొత్తాన్ని నిలిపివేశాయి. దీంతో హాస్టల్ నిర్వాహకులు రోజువారీ మెనూలో భారీ కోత విధించారు. ఉదయం టిఫిన్స్, సాయంత్రం స్నాక్స్ బంద్ చేసి, కేవలం అన్నం, ఒక కూర మాత్రమే వండి పెడుతున్నారు. పరిస్థితి దిగజారుతుండటంతో కొందరు నిర్వాహకులు అసలు భోజనమే అందించలేమని తేల్చి చెబుతుండగా, ఇంకొందరు కట్టెల పొయ్యిలను ఏర్పాటు చేసుకుని పొగలో నానా తంటాలు పడుతున్నారు.ఈ గ్యాస్ కొరత ప్రభావం కేవలం హాస్టళ్లకే పరిమితం కాలేదు. హైదరాబాద్ లాంటి మహానగరంలో లక్షలాది మంది ఐటీ ఉద్యోగులు, బ్యాచిలర్స్ ఆధారపడే హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ సెంటర్ల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. కమర్షియల్ సిలిండర్ల సరఫరా నిలిచిపోవడంతో నగరంలోని పలు చిన్న తరహా హోటళ్లు ఇప్పటికే మూతపడ్డాయి. వ్యాపారులు ముందుస్తుగా తీసుకున్న క్యాటరింగ్ ఆర్డర్లను రద్దు చేసుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దవాఖానాలు, క్యాంటీన్లలోనూ రోగులకు, సిబ్బందికి ఆహారం అందించడం కష్టంగా మారింది. సరఫరా లేకపోవడంతో బ్లాక్ మార్కెట్ దందా మొదలయ్యే ప్రమాదం పొంచి ఉందని సామాన్యులు ఆందోళన చెందుతున్నారు.మరోవైపు దేశవ్యాప్తంగా పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోంది. కమర్షియల్ గ్యాస్ పై ఆధారపడి నడిచే అనేక పారిశ్రామిక రంగాలు కుదేలవుతున్నాయి. బేకరీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు, గాజు తయారీ వంటి చిన్న, మధ్యతరహా పరిశ్రమల్లో ఉత్పాదకత నిలిచిపోయే ప్రమాదం ఏర్పడింది. దీనివల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్న లక్షలాది మంది కార్మికుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. దేశవ్యాప్తంగా రవాణా, లాజిస్టిక్స్ రంగాలపైనా ఈ ఎఫెక్ట్ పడుతోంది. హోటళ్లలో ఆహార పదార్థాల ధరలు అమాంతం పెరిగిపోయే అవకాశం ఉంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించి గ్యాస్ సరఫరాను గాడిలో పెట్టాలని, లేదంటే దేశవ్యాప్తంగా తీవ్రమైన ఆహార, ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

